దేవుడి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేస్తారనేది అందరికీ తెలిసిందే. అభిషేకం కోసం వినియోగించే పాత్రలను ప్రత్యేకంగా ఉంచుతారు. అభిషేకం కోసం ఇతర ఏ పాత్రలను వినియోగించరు. కానీ ఇందుకు విరుద్దంగా ఏపీలో ఓ గ్రామానికి చెందిన వారు వ్యవరించి హిందువుల ఆగ్రహానికి గురి అవుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… గురు పౌర్ణమి రోజున బాబాను అవమానించారు. బీర్ బాటిళ్ళతో తేనె, పాలను తీసుకొచ్చి దాంతో బాబా విగ్రహానికి అభిషేకం చేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరంలో చోటుచేసుకుంది. పర్వదినం రోజునే బీరు బాటిళ్ళు, వైన్ సీసాలతో బాబాకు అభిషేకం చేయడంపై తీవ్ర వివాదం చెలరేగుతోంది.
సాయి బాబా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఇరుగు పొరుగు గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేస్తుండగా.. కొంతమంది బీరు సీసాలు, విస్కీ బాటిళ్ళలో తేనె , ఇతర ద్రవ్యాలతో బాబా విగ్రహానికి అభిషేకం చేయడం పట్ల బాబా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని ఇలా చేసినట్లు ఆరోపిస్తున్నారు. బాబాను అవమానించిన భక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.