KCR : ఇప్పటికే తెలంగాణలో పలు ఉపఎన్నికలు జరిగాయి. దుబ్బాక, హుజూరాబాద్, హుజూర్ నగర్, నాగార్జున సాగర్ లాంటి నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరిగాయి. అందులో టీఆర్ఎస్ రెండు స్థానాల్లో గెలవగా, బీజేపీ రెండు స్థానాల్లో గెలిచింది. ఆ ఉపఎన్నికల వల్ల టీఆర్ఎస్ కు పెద్దగా వచ్చిన నష్టం ఏం లేదు కాబట్టి, ఆ ఉపఎన్నికల ఎఫెక్ట్ టీఆర్ఎస్ పై అంతగా చూపించలేదు. కానీ, నేటి పరిస్థితులు అలా లేవు. త్వరలో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఇంకో సంవత్సరంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆచీతూచీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉపఎన్నిక అవసరమా అన్నట్టుగా టీఆర్ఎస్ హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ కు కూడా ఈ సమయంలో ఉపఎన్నికకు వెళ్లే ఇష్టం లేదట. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో మునుగోడులో ఉపఎన్నిక వచ్చే అవకాశాలు ఉన్నాయని, తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం మునుగోడుకు టర్న్ అయ్యాయని అంతా అనుకుంటున్నారు. ఈనేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ మాత్రం మునుగోడు ఉపఎన్నికపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే వార్తలు వస్తున్నాయి.
KCR : అందుకే ఇంకా స్పీకర్, కోమటిరెడ్డి రాజీనామాను ఆమోదించలేదా?
ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చి తెలంగాణకు ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు కేసీఆర్. ముచ్చటగా మూడోసారి కూడా గెలిచి తెలంగాణ పీఠాన్ని అధిరోహించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అయితే, మొదటిసారి, రెండోసారి ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. తెలంగాణలో టీఆర్ఎస్ కు కాస్తో కూస్తో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం కానీ, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని, ముందస్తు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ దే గెలుపు అని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి.
అయినా కూడా ఉపఎన్నిక విషయంలో మాత్రం కేసీఆర్ వెనుకడుగు వేస్తున్నారట. దానికి కారణం.. ఒకవేళ మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే, అది వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని టీఆర్ఎస్ అధిష్ఠానం టెన్షన్ పడుతోందట. అందుకే.. కోమటిరెడ్డి రాజీనామా విషయంపై టీఆర్ఎస్ నేతలు ఎవ్వరూ మాట్లాడటం లేదు. స్పీకర్ కూడా ఇప్పటి వరకు కోమటిరెడ్డి రాజీనామాను ఆమోదించలేదు. స్పీకర్ సమయం కోసం కోమటిరెడ్డి కోరితే, నాలుగైదు రోజుల తర్వాత అపాయింట్ మెంట్ ఇచ్చారట. అపాయింట్ మెంట్ నాలుగు రోజుల తర్వాత ఇచ్చారంటే, కోమటిరెడ్డి రాజీనామాను ఆమోదించే విషయంపై స్పీకర్ మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా మునుగోడు విషయంలో కేసీఆర్ ఎలాంటి స్టెప్ వేస్తారనే దానిపై ఎవ్వరికీ క్లారిటీ లేదు.