Munugodu bypoll : ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ మునుగోడు చుట్టూ తిరుగుతున్నాయి. ఇంకో సంవత్సరంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈనేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యే స్థానం ఖాళీగా ఉండటంతో ఆరు నెలల లోపు మునుగోడులో ఉపఎన్నిక రానుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల వేళ మునుగోడు ఉపఎన్నిక చాలా పార్టీలకు పెద్ద తలనొప్పిని తీసుకొచ్చినట్టు అయింది.
మునుగోడు ఉపఎన్నిక ప్రస్తుతం తెలంగాణలోని అన్ని పార్టీలకు సెమీ ఫైనల్ గా మారింది. ఈ సెమీ ఫైనల్ లో గెలిచిన వాళ్లే ఫైనల్స్ లో పోటీ పడగలరు. ఇప్పటికే తెలంగాణలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మూడో సారి కూడా ముఖ్యమంత్రి అయ్యేందుకు, మూడో సారి కూడా తన పార్టీని గెలిపించుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే మునుగోడు ఉపఎన్నికను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది.
Munugodu bypoll : అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ.. మధ్యలో టీఆర్ఎస్
ఈ ఉపఎన్నికల్లో ప్రతి పార్టీకి గెలవాలనే ఉంది. కాంగ్రెస్, బీజేపీలు అయితే ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం సాధించడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో మునుగోడులోనూ గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం.. ఆ పార్టీ అభ్యర్థిగా నిలబడుతుండటంతో బీజేపీకి కొంత ప్లస్ పాయింట్ కానుంది ఈ ఉపఎన్నిక.
నిజానికి మునుగోడు కాంగ్రెస్ కంచుకోట. కానీ.. రాజగోపాల్ రెడ్డికి అక్కడ బాగానే ఫాలోయింగ్ ఉంది. అక్కడ పార్టీ పేరుతో కాకపోయినా.. రాజగోపాల్ రెడ్డిని చూసి.. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినందుకు అయినా మళ్లీ ఉపఎన్నికల్లో జనాలు ఆయన్ను గెలిపించాలని భావిస్తే.. అప్పుడు రాజగోపాల్ రెడ్డి గెలుపు సునాయసం అవుతుంది. అప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నెత్తి మీద గుడ్డ వేసుకొని పడుకోవాల్సిందే.
ఏది ఏమైనా.. ఎవరు అవునన్నా కాదన్నా.. మునుగోడులో గెలిచిన పార్టీకే వచ్చే ఎన్నికల్లో మంచి మైలేజ్ ఉండే చాన్స్ ఉంది. జనాల్లోనూ ఆ పార్టీపై నమ్మకం పెరిగే చాన్స్ ఉంది. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా. చూద్దాం మరి.. మనుగోడులో ఏ పార్టీ జెండా ఎగురుతుందో?